మండల సభలకు పకడ్బందీ ఏర్పాట్లు:కలెక్టర్ ఇలా త్రిపాఠి
చిత్రం న్యూస్ నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 16న మండల కేంద్రాలు, మున్సిపల్ పట్టణాలలో నిర్వహించనున్న సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు మంగళవారం పలు సూచనలు చేశారు. ముందస్తుగానే సభా వేదికలను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లతో, ఇతర మండల స్థాయి అధికారులతో సమావేశమై తగు సూచనలు చేయాలన్నారు. సభలు నిర్వహించే ప్రదేశాలలో తగిన నీడ, తాగునీరు వంటి కనీస వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 8.00 గంటల నుండి 10.30 గంటల లోపు సభలు ముగిసేలా ప్రణాళిక రూపొందించూసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సభలలో అవగాహన కల్పించడంతో పాటు, ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్దిదారుల వివరాలు చదివి వినిపించాలని, లబ్ధిదారులతో వారి అనుభవాలను తెలియజేసేలా చూడాలన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వంటి వాటికి సంబంధించి గ్రామ సభలలో వచ్చిన అర్జీలను మండల సభలకు ముందు తప్పనిసరిగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సభలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, అందరూ భాగస్వాములు అయ్యేలా చొరవ చూపాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు ఉద్దేశించిన అరైవ్-అలైవ్ కార్యక్రమం గురించి సభల్లో తెలియజేయాలని అన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సభల విజయవంతానికి అంకిత భావంతో కృషి చేయాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, జడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, ఆర్డీఓ రాజేంద్రకుమార్, డీపీఓ శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.