Chitram news
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 10:18 pm Editor : Chitram news

అంబేద్కర్‌ చౌక్‌లో ఘనంగా బాబాసాహెబ్ జయంతి వేడుకలు: సంత్ శిరోమణి గురు రావిదాస్ 250వ జయంతి క్యాలెండర్ ఆవిష్కరణ

అంబేద్కర్‌ చౌక్‌లో ఘనంగా బాబాసాహెబ్ జయంతి వేడుకలు: సంత్ శిరోమణి గురు రావిదాస్ 250వ జయంతి క్యాలెండర్ ఆవిష్కరణ

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారత రత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అణగారిన వర్గాల చైతన్యానికి కృషి చేసిన మహనీయుడు శ్రీ సంత్ శిరోమణి గురు రావిదాస్ 250వ జయంతి వారోత్సవాలను పురస్కరించుకుని, ఆయన జ్ఞాపకార్థం రూపొందించిన క్యాలెండర్‌ను ప్రముఖులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్  రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అసిస్టెంట్ కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి అనూష బండారి సతీష్, లైబ్రరీ చైర్మన్ మల్లెపూల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి గురు రావిదాస్ చేసిన కృషి అనన్యసామాన్యమని కొనియాడారు. చర్మకార వృత్తిలో పుట్టినా, తన ఆధ్యాత్మిక కవితల ద్వారా మూఢనమ్మకాలపై పోరాడి, కుల విభేదాలు లేని సమ సమాజ నిర్మాణం కోసం ఆయన మార్గదర్శనం చేశారని పేర్కొన్నారు. అంబేద్కర్, గురు రావిదాస్ వంటి మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

సామాజిక సమరసత వేదిక బాధ్యులు అప్పల ప్రసాద్ రాష్ట్రవ్యాప్తంగా అభ్యుదయ భావాలను చాటడానికి చేస్తున్న కృషిని అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మోచి సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలశంకర్ కృష్ణ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కావల్ల రమేష్, బాలశంకర్ ప్రవీణ్,సామ రమేష్ రెడ్డి, మెస్రం రాజేశ్వర్, ఓటర్కర్ సంతోష్  వివిధ దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.