ఘనంగా అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ప్రారంభం
*అమరులైన అగ్నివీరులకు నివాళులు
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో :జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలను జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14వ తేదీన ముంబై నగరంలోని విక్టోరియా డాక్ యార్డ్ లో నౌక అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్గిమాపక సిబ్బంది ప్రాణాలు అర్పించారు. ఈ ప్రమాదంలో సిబ్బందితోపాటు 345 మంది స్థానిక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన అమరులకు నివాళులు అర్పించడం జరుగుతుందని డీఎఫ్ఓ పరమేశ్వర్ తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు పలు సముదాయాల వద్ద ప్రజలకు అగ్ని ప్రమాదల నివారణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.ఈ నెల 20 వ తేదీ ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరపత్రాల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కరపత్రాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విడుదల చేస్తారని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.వారోత్సవాల్లో భాగంగా అగ్నిమాపక పరికరాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ నిజామాబాద్ స్టేషన్ ఆఫీసర్ శంకర్, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.