Chitram news
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 10:16 pm Editor : Chitram news

సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధులపై పోచారం ఆగ్రహం

సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధులపై పోచారం ఆగ్రహం

*ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతు సమస్యల విషయంలో మరో సారి తన కట్టుబాటును చాటుకున్నారు. బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు ప్రభుత్వం నిధులు మం జూరు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు జీవనాడిగా నిలిచే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి వరకు రిజర్వాయర్ ప్రాంగణంలోనే ఉండి,సంబంధిత శాఖల ఉన్నతా ధికారులతో పాటు పలువురు కీలక వ్యక్తులతో ఫోన్ ద్వారా సంప్ర దింపులు జరిపారు. సమస్యకు వెంటనే పరిష్కారం దొరకాలన్న లక్ష్యంతో ఆయన నిరంతరం ప్రయత్నించినప్పటికీ, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు ఫోన్లు ఎత్తకపోవడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. “ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం వస్తోంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యవహార శైలి పై పోచారం తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేల మాటకు విలువ లేకుండా పోయిందని, ప్రజాప్రతినిధులు చెప్పినా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధుల కోసం తాను పలుమార్లు మంత్రిని సంప్రదించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. “మంత్రికి ఇరవై సార్లు చెప్పాను. అయినా పట్టించుకోలేదు. ఈ వయస్సులో నిధుల కోసం ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ వర్ని మండల రైతులకు అత్యంత కీలకమైనది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. అయితే నిధుల కొరత కారణంగా పనులు నిలిచిపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎమ్మెల్యే పోచారం స్వయంగా రంగంలోకి దిగడం, రాత్రివేళల వరకు అధికారులతో చర్చలు జరపడం ఈ సమస్య తీవ్రతను సూచిస్తోంది. స్థానిక రైతులు కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేసి పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోచారం వ్యాఖ్యలతో ఈ అంశం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. రైతు సంక్షేమం కోసం ఆయన తీసుకుంటున్న కఠిన వైఖరి, ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారానికి దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.