* డా.అన్నా బాహు సాఠే విగ్రహావిష్కరణ
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో ఆదివారం డా అన్నా బాహు సాఠే విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, నాయకులు పిడమర్తి రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు కౌన్సిలర్లను కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ..డా. అన్నా బాహు సాఠే, కేవలం ఒక వర్గానికి చెందిన వారు కాదు, ఆయన అణగారిన వర్గాల గొంతుకని, తెలంగాణ గడ్డపై సామాజిక న్యాయం జరగాలన్నదే మన ప్రభుత్వ సంకల్పమన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో మాదిగ సోదరుల పాత్ర మరువలేనిదన్నారు.
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించుకోవడం మన బాధ్యతన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బహుజన పక్షపాతిగానే ఉంటుందన్నారు. ఇవాళ ఇక్కడ ఇంతమంది మాదిగ ప్రజాప్రతినిధులను సన్మానించుకోవడం గర్వకారణమన్నారు. రాజకీయాల్లో ఎదిగిన మాదిగ సోదరులు తమ అధికారాన్ని పేదల సంక్షేమం కోసం ఉపయోగించాలన్నారు. బలహీన వర్గాల సాధికారత కోసమే ఇవాళ కులగణన వంటి కీలక నిర్ణయాలను మనం ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.
రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ..సాఠే విగ్రహం మనకు నిరంతరం పోరాట పటిమను గుర్తుచేస్తుందన్నారు. ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గం నుంచి గెలుపొందిన సర్పంచులు, కౌన్సిలర్లు తమ ప్రాంత అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలన్నారు. దళిత సమాజం ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే నిజమైన సామాజిక మార్పు సాధ్యమన్నారు. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందేలా చూడటమే మన లక్ష్యమన్నారు.