Chitram news
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 6:30 pm Editor : Chitram news

శనగ కొనుగోళ్లు తాత్కాలికంగా నిలుపుదల: రైతుల్లో ఆందోళన

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని శనగ రైతులకు మార్క్ ఫెడ్ (Markfed) అధికారులు కీలక సూచన చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ద్వారా జరుగుతున్న శనగల కొనుగోళ్లను 4 నుండి 5 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కేటాయించిన కొనుగోలు కోటా పూర్తి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుండి తదుపరి కొనుగోలు కోటా మరియు అనుమతులు వచ్చే వరకు మార్కెట్ కు కొత్తగా శనగలను తీసుకురావద్దని సెక్రటరీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కొన్ని కేంద్రాల్లో సాంకేతిక ఇబ్బందుల వల్ల కూడా కొనుగోళ్లు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. మార్కెట్ యార్డులకు శనగలను తీసుకువచ్చి ఇబ్బందులు పడకుండా, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వేచి ఉండాలని అధికారులు కోరారు. మరోవైపు, అప్పటికే మార్కెట్ కు చేరుకున్న నిల్వలను కాపాడుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు. గిట్టుబాటు ధరపై ఆశలు పెట్టుకున్న తమకు, కొనుగోళ్లు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోందని రైతులు వాపోతున్నారు.