* మొక్కలకు నీరు పోస్తూ..ప్రాణంగా చూస్తూ
* ఆదర్శంగా నిలుస్తున్న బట్టి సావర్గాం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ యువకులు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మొక్కలు అందరూ నాటుతారు..వాటిని సంరక్షించడమే కష్టం..ఇలాంటి తరుణంలో నాటిన మొక్కలను కాపాడుకునేందుకు బట్టి సావర్గాం గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ యువత నడుంబిగించారు. శ్రమ నీ ఆయుధమైతే.. విజయం నీ బానిసవుతుంది అనే నానుడిని నిజం చేస్తున్నారు వీరంతా..ప్రతి ఆదివారం నీరు పోస్తూ మొక్కలను కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
సర్పంచ్ కాకముందే ఆలోచనకు బీజం..
ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టి సావర్గాం గ్రామ పంచాయతీలోని స్మశానవాటికలో మొక్కలు లేక ఎడారిగా ఉండడం, చెట్ల నీడ లేక పక్షులు రాక పోవడంతో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఆలోచనకు బీజం పడింది. ఎలాగైనా మొక్కలు నాటాలని సర్పంచ్ కాక ముందే నిర్ణయించుకున్నారు. అనుకున్నది తడవుగా శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులు రూ.లక్షకు పైగా ఖర్చు పెట్టి గత ఏడాది జూన్ నెలలో సుమారు 300 మొక్కలను నాటించారు. అందులో 10 మొక్కల వరకు పోయాయి. ఉన్న 290 మొక్కలను ఎలాగైనా సంరక్షించాలని కంకణం కట్టుకున్నారు. గ్రామ యువత సైతం తోడు కావడంతో ప్రతి ఆదివారం నీరు పోస్తూ మొక్కల సంరక్షణ చేపడుతున్నారు..
మండుటెండలో మొక్కవోని సంకల్పంతో..
40 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ మొక్కలను కాపాడేందుకు గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా తెచ్చిన నీటిని మొక్కలకు పోస్తూ సర్పంచ్ తో పాటు యువకులంతా కాపడుతున్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఎవరైనా అంత్యక్రియలకు వస్తే ఎండకు ఎండుతూ.. వర్షంలో తడుస్తూ ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారని గ్రహించాను. మొక్కలను సంరక్షిస్తే వృక్షాలుగా మారి నీడతో పాటు పక్షులు వచ్చే అవకాశం ఉంటుందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. పచ్చగా కనిపిస్తున్నాయి.
