సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లతో భేటీలో కలెక్టర్ ఇలా త్రిపాఠి
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు విస్తృత స్థాయిలో సమాచారం చేరడంలో సామాజిక మాధ్యమాలు ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు కూడా సంక్షేమ పథకాల అమలులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను పురస్కరించుకుని చేపట్టనున్న కార్యక్రమాలను విస్తృత స్థాయిలో ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల సేవలను వినియోగించుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా గణనీయమైన సంఖ్యలో ఫాలోవర్లు కలిగి ఉన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు ఎంతో ఉత్సాహంతో తరలివచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ మానవీయ కోణంలో, శాస్త్రీయ దృక్పధంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు, సబ్సిడీపై వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ, వడ్డీ లేని రుణాలు, రైతు రుణ మాఫీ, రైతు భరోసా వంటి అనేక పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఇంటర్ వరకు విద్యార్థులకు మద్యాహ్న భోజన పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేయనుందని, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం కూడా అమలు కానుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకునేలా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు తమ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో భాగస్వాములై వాటి విజయవంతానికి తోడ్పాటును అందించాలని కోరారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఉద్దేశించిన అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని తమదైన శైలిలో ప్రజకు చేరవేయాలని, తద్వారా ప్రమాదాల నియంత్రణకు దోహదపడిన వారు అవుతారని అన్నారు. ఈ నెల 13న గ్రామ పంచాయతీల స్థాయిలో జరిగే గ్రామ సభలతో పాటు, 16న జరిగే మండల స్థాయి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక సభలలో పాల్గొని ప్రజలను చైతన్యపర్చాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో భాగస్వాములయ్యే సామాజిక మాధ్యమకర్తలకు జిల్లా యంత్రాంగం తరపున తప్పనిసరిగా తగిన గుర్తింపును అందిస్తామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, డీఈఓ అశోక్, డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, డీపీఆర్ఓ పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.