మాతా, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిత్యం పిల్లలతో మమేకమై ఉండే అంగన్వాడీల పాత్ర గ్రామీణస్థాయిలో అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. నిజమాబాద్ రూరల్, అర్బన్ సీడీపీవో లు జ్యోతి, సౌందర్య ల నేతృత్వంలో అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వంచే అందజేస్తున్న స్మార్ట్ ఫోన్లను శుక్రవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు 200 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ..అంగన్వాడీ టీచర్లు గ్రామీణస్థాయిల్లో పిల్లలను తమ పిల్లలుగా భావించి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాతా, శిశు సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ.. అనేక కార్యక్రమాలు చేపడుతుందని వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాద్యత అంగన్వాడీ టీచర్ల పై ఉంటుందన్నారు. పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందజేయడంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు.ఇప్పటికే నియోజకవర్గంలో మొత్తం 26 కొత్త అంగన్వాడీ భవనాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అవసరమైన చోట మరిన్ని మంజూరు చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి,ధర్పల్లి,ఇందల్వాయి సూపర్వైజర్లు మమతా,బుజ్జి,సరిత,సునీత, డిచ్ పల్లి బ్లాక్ కో ఆర్డినేటర్ రంజిత్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.


