చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మారుమూల నివాస ప్రాంతాలకు సైతం రక్షిత మంచి నీటిని అందించేందుకు వీలుగా ఎడపల్లి మండలం జానకంపేట వద్ద ఏర్పాటు చేసిన ఆన్లైన్ బూస్టర్ సిస్టమ్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. దీని పనితీరు, ప్రయోజనాల గురించి గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిట్టచివరన ఉండే ఆవాసాలకు కూడా తాగునీరు చేరుకునేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతగిరి, పోచారం గ్రామాలకు సైతం తాగునీటి సరఫరా కోసం ఇదేతరహా ఏర్పాట్లు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తుగానే చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ప్రతి ఆవాస ప్రాంతానికి రక్షిత మంచి నీరు సరఫరా అయ్యేలా పక్కాగా పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ లు రాకేష్, స్వప్న తదితరులు ఉన్నారు.
