సీపీఐ వందేళ్ల ప్రస్థానం – అప్రతిహతంగా ప్రజా పోరాటాలు: ముడుపు ప్రభాకర్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారతదేశంలో నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాలకు పెట్టింది పేరు సీపీఐ పార్టీ అని, వందేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో నిరంతరం పేదల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీయేనని సీపీఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో ‘ఇంటికీ సీపీఐ’ కార్యక్రమంలో భాగంగా పార్టీ కరపత్రాలను పంపిణీ చేస్తూ, విరాళాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని, అవినీతిపరులను అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే సీపీఐ లక్ష్యమని స్పష్టం చేశారు.
సీపీఐ కార్యక్రమానికి ప్రజల నుండి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోందని, దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు బలోపేతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించారు. సమసమాజ స్థాపన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో, ప్రజలు సీపీఐ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమీనా ఖాన్, గిరిజన సంఘం నాయకులు కోడప సురేష్, ఆదిలాబాద్ మండల కార్యదర్శి మహబూబ్ ఖాన్, శ్యామల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


