ప్రజల పక్షాన నిలిచే పార్టీ సీపీఐ: జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలారెడ్డిబాద్ టౌన్: సమాజ స్థాపనే ధ్యేయంగా, అణగారిన వర్గాల న్యాయం కోసం నిరంతరం పోరాడే పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని హమీద్ పుర, మార్కెట్ ప్రాంతాల్లో ‘ఇంటింటికీ సీపీఐ’ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు ముమ్మర ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికీ తిరుగుతూ పార్టీ లక్ష్యాలను వివరిస్తూనే, ప్రజల నుండి స్వచ్ఛందంగా విరాళాలను సేకరించారు. స్వాతంత్ర్య పోరాటంలో సీపీఐ చేసిన త్యాగాలను, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను మైక్ ద్వారా ప్రజలకు వివరించారు. పార్టీ చేపడుతున్న ప్రజా పోరాటాలు, కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా నిలుస్తున్న తీరును వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కమ్యూనిస్టు పార్టీ ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగడమే తమ పార్టీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ప్రజలు తమకు అండగా నిలిచి, పోరాటాలకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆయన వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, గిరిజన సంఘం నాయకులు కడప సురేష్, రైతు సంఘం నాయకులు సోమపురి జగన్నాథ్, లక్ష్మణ్, ఇతర కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
