Chitram news
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 11:59 pm Editor : Chitram news

పోచంపాడ్‌లో కత్తిపోట్ల ఘటన: యువకుడి దారుణ హత్య

చిత్రం న్యూస్, నిజామాబాద్ జిల్లా బ్యూరో: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలో పాత వివాదాల నేపథ్యంలో జరిగిన కత్తిపోట్ల ఘటనలో రిషిక్ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.పోచంపాడ్ గ్రామంలో వేణు కుటుంబానికి, నర్సింలు కుటుంబానికి మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమస్య పరిష్కారానికి రిషిక్ నర్సింలు ఇంటికి వెళ్లగా, అక్కడ ఘర్షణ పెరిగి కత్తిపోట్లకు దారితీసింది.

నర్సింలు కుమారులైన ఉదయ్ చందు, కిషోర్, అరవింద్ కలిసి రిషిక్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో రిషిక్ కడుపులో తీవ్ర గాయాలు కావడంతో అతన్ని నిర్మల్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో రిషిక్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. యువకుడి మృతితో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుహాసిని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించి, భద్రతను పెంచారు. పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.