చిత్రం న్యూస్, మహబూబాబాద్: న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌన పోరాటానికి దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గుండె శివారు వాగ్య తండాలో చోటుచేసుకుంది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..వాగ్య తండాకు చెందిన తేజావత్ రఘురాం, కేసముద్రం మండలం రేకుల తండాకు చెందిన గూగులోత్ స్పందన గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా రఘురాం పెళ్లికి నిరాకరిస్తున్నాడు. ఈ విషయమై గతంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆమె తెలిపింది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ రఘురాం ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది.విషయం తెలుసుకున్న గూడూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్పందనను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని ఆమె భీష్మించుకుని కూర్చుంది.

