Chitram news
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 3:15 pm Editor : Chitram news

శనగ పంట కొనుగోలు చేయాలి: ఏనుగు రాకేష్ రెడ్డి డిమాండ్

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో గత రెండు రోజులుగా బర్దాన్ (గన్నీ బ్యాగుల) కొరత కారణంగా శనగ కొనుగోళ్లు నిలిచిపోవడంపై కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఏనుగు రాకేష్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సంచులు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకవైపు అకాల వర్షాలు కురుస్తుండటం, మరోవైపు తెచ్చిన పంటను అమ్ముకోలేక రైతులు మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనగ పంట కొనుగోళ్లు ప్రారంభించిన కేవలం మూడు రోజులకే బర్దాన్ లేదనే సాకుతో రెండు రోజులుగా బంద్ చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

మరికొద్ది రోజుల్లో జొన్న పంట కూడా కోత దశకు వస్తుందని, ఈలోపే శనగ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన బర్దాన్ సరఫరా చేయాలని, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా శనగలను కొనుగోలు చేయాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.