చిత్రం న్యూస్,బజార్హత్నూర్ : ఆదిలాబాద్ పట్టణాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సహకరించాలని కోరుతూ ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్, అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సోమవారం బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు వీరు హాజరయ్యారు. సభ అనంతరం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు, పట్టణంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన సమగ్ర నివేదికను ఆయనకు అందజేశారు. ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలు మార్చడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల అవశ్యకతను ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నేతల విన్నపంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
