చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: కూలీ డబ్బుల పంపకంలో తలెత్తిన వివాదం ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఘటనలో నిందితుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సోమవారం సంచలన తీర్పునిచ్చింది. నిజామాబాద్ జిల్లా డిచ్పో పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో జరిగిన ఈ జంట హత్యల కేసులో నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి జి.వి.ఎన్. భారత లక్ష్మి ఈ తీర్పును వెలువరించారు. పోలీసుల కథనం ప్రకారం..2021 ఆగస్టు 14న డిచ్పల్లి మండల కేంద్రంలో ఒక పని నిమిత్తం మామ, అల్లుడు, బావమరిది కలిసి వెళ్లారు. సాయంత్రం పని ముగిశాక అడ్డమీద కూలీ డబ్బులు పంచుకునే క్రమంలో వారి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు అక్కడే ఉన్న కత్తికి పదును పెట్టే ఆకురాయి, చాకుతో మామ, బావమరిదిపై విచక్షణారహితంగా దాడి చేసి అతి దారుణంగా హత్య చేశాడు. ఘటన అనంతరం నిందితుడు కర్ణాటక రాష్ట్రానికి పారిపోయి తలదాచుకున్నాడు.అప్పట్లో సీఐ రఘునాథ్ ఈ కేసు విచారణను ప్రారంభించగా.. ప్రస్తుత సీఐ వినోద్ రెడ్డి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి ఆచూకీ కనిపెట్టి అరెస్టు చేశారు. పక్కా ఆధారాలతో చార్జిషీటు దాఖలు చేసి, విచారణను వేగవంతం చేశారు.
సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా జడ్జి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారనీ అన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల అదనపు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేశారన్నారు. నేరస్తులకు శిక్ష పడటం ద్వారా సమాజంలో పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని ఈ కేసులో ప్రతిభకనబరిచిన అధికారులను సీ పీ సాయి చైతన్య అన్నారు. కేసులో కీలకపాత్ర పోషించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్, డిచ్పల్లి సీఐ వినోద్ రెడ్డి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ (ఎస్సై) గోవింద్, హెడ్ కానిస్టేబుల్ కిషన్ లను పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.


