మూడు టిప్పర్లు, రెండు జేసీబీలు, ఒక ట్రాక్టర్ సీజ్
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో :అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు, రవాణా జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అక్రమ మొరం, ఇసుక తవ్వకాలు, రవాణాపై గట్టి నిఘా కొనసాగిస్తున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఆర్మూర్ డివిజన్ పరిధిలోని నందిపేట పలుగుట్ట ప్రాంతంలో అక్రమ మొరం తవ్వకాలు జరుపుతున్నారనే పక్కా సమాచారంతో సీసీఎస్ పోలీసులు సోమవారం దాడి జరిపారని తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు జరుపుతున్నారని గుర్తించి, స్థానిక తహసీల్దార్ సంతోష్ రెడ్డికి సమాచారం అందించగా, ఆర్.ఐ దివ్య అక్కడికి చేరుకుని పంచనామ నిర్వహించారని అన్నారు. ఈ సందర్భంగా మొరం తవ్వకాల కోసం ఉపయోగిస్తున్న మూడు టిప్పర్లు, రెండు జెసిబీలు, ఒక ట్రాక్టర్ ను సీజ్ చేసి నందిపేట్ ఎస్ హెచ్ ఓ శ్యాంరాజ్ కు అప్పగించడం జరిగిందని అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మొరం, ఇసుక తవ్వకాలు, రవాణాను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.


