Chitram news
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 4:50 pm Editor : Chitram news

ఆదిలాబాద్‌లో ఇంటింటికి సీపీఐ 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, సీపీఐ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని 45వ వార్డులో సోమవారం ‘ఇంటింటికి సీపీఐ ‘ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ తిరిగి విరాళాలు సేకరిస్తూనే, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాలను వివరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, “ప్రజల కోసం మీరు చేసే పోరాటాలకు ఎన్ని విరాళాలు ఇచ్చినా తక్కువే” అంటూ మద్దతు తెలపడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు ఎస్.అరుణ్ కుమార్, దళిత కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు,సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామదాస్, గిరిజన సంఘం నాయకులు కొడప సురేష్, శాంతన్ కుమార్, సోను బాయ్, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.