Chitram news
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 12:59 pm Editor : Chitram news

కరంజి-కె లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

చిత్రం న్యూస్, జైనథ్: మహోన్నత సంఘ సంస్కర్త, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, భారత మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను కరంజి-కె గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ గొంటిముక్కుల శైలజ పొచ్చన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శైలజ పొచ్చన్న బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో ముఖ్యంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, రాజకీయవేత్తగా ఆయన అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలు తొలగించి, పేద ప్రజల హక్కుల కోసం ఆయన అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకున్నారు.