Chitram news
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 9:08 pm Editor : Chitram news

సెల్ ఫోన్ కోసం హ‌త్య‌.. నిందితుడిని రిమాండ్ కి త‌ర‌లింపు

నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  సెల్ ఫోన్ కోసం తోటి కూలీనే హ‌త్య చేసి ప‌రారైన నిందితుడిని ప‌ట్టుకొని శ‌నివారం అరెస్ట్ చేసే రిమాండ్ కి త‌ర‌లించిన‌ట్టు కామారెడ్డి స‌బ్ డివిజ‌నల్ ఏఎస్పీ చైత‌న్య‌రెడ్డి తెలిపారు. సంఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఆమె మీడియాకి వెల్ల‌డించారు. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో గత ఫిబ్రవరిలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేవలం మొబైల్ ఫోన్, నగదు కోసం తోటి కూలీని అత్యంత కిరాతకంగా హతమార్చిన నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. గత ఫిబ్రవరి 12న రాత్రి సమయంలో, కామారెడ్డి బ‌స్టాండ్ ఎంక్వయిరీ కౌంటర్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య మొబైల్ ఫోన్ విషయం పై ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని అర్ని తలోక్ జిల్లా పంగిడి కి చెందిన నిందితుడు ఆకాష్ నాగురావ్ కోవె బాధితుడైన శ్రీనివాస్ (కూలీ) ముఖం, ఛాతిపై విచక్షణారహితంగా దాడి చేసి, కింద పడేసి చంపాడు. అనంతరం బాధితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్, రూ.300 నగదును దోచుకుని అక్కడి నుండి పరారయ్యాడు. ఈ విషయం పై బ‌స్టాండ్ కంట్రోలర్ షెర్ల సత్య గౌడ్ ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు నిందితుడిని పట్టుకుని విచారించగా అతను తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, నిందితుడిని కోర్టులో రిమాండ్ చేసినట్లు తెలిపారు.