Chitram news
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 8:34 pm Editor : Chitram news

ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఫులే స్మృతి వనం:అఖిల భారతీయ మాలీ మహాసంఘం హర్షం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో రూ. 4 కోట్ల  నిధులతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ ఫులే స్మృతి వనాన్ని’ ఈ నెల 11న మహాత్మా జ్యోతిభా ఫులే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనుండటం పట్ల అఖిల భారతీయ మాలీ మహాసంఘం హర్షం వ్యక్తం చేసింది. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే, ప్రధాన కార్యదర్శి సాంబన్న షిండే తదితరులు మాట్లాడారు. సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మా జ్యోతిబా ఫులే, తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫులే దంపతుల విగ్రహాలను ట్యాంక్ బండ్‌పై ప్రతిష్టించాలని తాము గత అనేక ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. గత ఏడాది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం సమర్పించగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించి స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఘనంగా ఫూలే జయంతి వేడుకలు: ప్రతి ఏటా రాష్ట్రంలోని 33 జిల్లాలకు రూ. 20 లక్షల నిధులను మంజూరు చేసి అధికారికంగా ఫూలే జయంతి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని వారు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అదనంగా రూ.లక్ష  నిధులు విడుదల చేసి, ఈ ఏడాది కూడా జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కోరారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని, ఫులే దంపతులు కలలుగన్న సమసమాజ నిర్మాణం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాలీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అంబేకర్, ప్రధాన కార్యదర్శి ప్రధాన్ భాస్కర్, కార్యవర్గ సభ్యులు వాడగురే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.