Chitram news
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 1:31 pm Editor : Chitram news

హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

* ఇద్దరు అన్నదమ్ములు మృతి, ఐదుగురికి గాయాలు

చిత్రం న్యూస్, హనుమకొండ: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవనూరు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం  చోటుచేసుకుంది. వేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ధర్మసాగర్ మండలం దేవనూరు సమీపంలో జరిగిన ఈ ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. కారు అతివేగంతో వెళ్తూ అదుపుతప్పి చెట్టును ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది.

మృతులను జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఏనుగుల శివ, లోకేష్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ అన్నదమ్ములని తెలియడంతో నర్సాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగం, అజాగ్రత్తతో వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.