చిత్రం న్యూస్, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ పట్టణంలోని రోస్ గార్డెన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క సమావేశానికి అధ్యక్షత వహించారు. సమావేశానికి ముందు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్లకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి సుగుణక్క ఘన స్వాగతం పలికి, శాలువాలతో సన్మానించారు. అనంతరం నూతన జిల్లా కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా సుగుణక్క అందజేశారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చిన్నదైనా ప్రాముఖ్యత కలిగిన జిల్లాగా అభివర్ణించారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లా మళ్లీ అదే దిశగా సాగుతోందని తెలిపారు.రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రజల సమస్యలను తెలుసుకుని, వారికి న్యాయం చేయాలనే లక్ష్యంతో జరిగిందని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, పార్టీలో 70 శాతం నాయకత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దక్కిందని తెలిపారు.
గ్రామాల అభివృద్ధి దేశ అభివృద్ధికి మూలమని గాంధీ చెప్పిన మాటలను గుర్తుచేస్తూ గ్రామీణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు ఉన్నత పదవులు కల్పించిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో భారీ అప్పులు పెరిగాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తోందన్నారు. రైతు రుణమాఫీ విషయంలో గతంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉపశమనం కల్పించిందని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కలుగుతోందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా దీనిని అంగీకరిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100కి పైగా సీట్లు సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు సాధిస్తుందని, ప్రజలు అభివృద్ధి వైపు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారని, భవిష్యత్తులో విమాన సదుపాయం కూడా అందుబాటులోకి రానుందని తెలిపారు.
కుమురం భీం జిల్లాలో అవసరమైన పరిశ్రమలను స్థాపించి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు బలంగా ఉందని, రాబోయే 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ,..జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని స్థాయిల్లో కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేస్తున్నామని చెప్పారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్కు బలమని, వారి కృషితోనే విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత పెంచుతామని, జిల్లా వ్యాప్తంగా పార్టీని మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


