Chitram news
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 9:54 pm Editor : Chitram news

అటవీ అధికారులకు తాబేలును అప్పగించిన రైతు వెంకటేశ్వర రావు 

చిత్రం న్యూస్, పెనుబల్లి : ఖమ్మం జిల్లా  పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన రైతు తగరం వెంకటేశ్వరరావు తన పొలంలో పనిచేస్తుండగా ఒక అరుదైన తాబేలు కనిపించింది. సాధారణంగా ఈ తాబేలు ప్రత్యేక లక్షణాలతో ఉండటంతో ఆయన దానిని జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చారు. అనంతరం ఆ తాబేలు గురించి సంబంధిత అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని తాబేలును స్వాధీనం చేసుకున్నారు. ప్రకృతి సంపదను కాపాడే బాధ్యతతో తగరం వెంకటేశ్వరరావు వ్యవహరించిన తీరు ప్రశంసనీయమని అధికారులు తెలిపారు. తాబేలును సురక్షిత ప్రాంతానికి తరలించి, అవసరమైన సంరక్షణ చర్యలు చేపడుతామని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. అడవి జంతువులను గుర్తించినప్పుడు వాటిని స్వయంగా సంరక్షించకుండా అధికారులకు అప్పగించడం ఎంతో ముఖ్యమని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా రైతు తగరం వెంకటేశ్వరరావుని అటవీశాఖ అధికారులు అభినందిస్తూ, ఇలాంటి బాధ్యతాయుత చర్యలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.