చిత్రం న్యూస్,నల్లబెల్లి: దేశ సేవకే అంకితమైన పార్టీ భారతీయ జనతా పార్టీ అని, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి సమగ్ర మానవతా దృక్పథమే దేశ నిర్మాణానికి మార్గదర్శకమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. నల్లబెల్లి మండలంలోని మేడపల్లి గ్రామంలో గల యశోద ఫంక్షన్ హాల్లో మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ అధ్యక్షతన ‘పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్’ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల్లో సైద్ధాంతిక స్పష్టత పెంపొందించడం, సంస్థాగత బలోపేతం, ప్రజలతో మమేకం కావడంపై కీలక దిశానిర్దేశం చేశారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను బూత్ స్థాయి నుండి ప్రజలకు వివరిస్తూ, రాబోయే రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచంద్ర రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి, రంగాపురం సర్పంచ్ ఓరుగంటి మాధవి రాజు, మండల ప్రధాన కార్యదర్శులు ఈర్ల నాగరాజు, తిరుపతి, మండల ఉపాధ్యక్షులు గుర్రపు నరేష్, బత్తిని కుమారస్వామి, యాదగిరి, మండల కార్యదర్శి ఓదెల అశోక్, కోశాధికారి మురికి మనోహర్, సీనియర్ నాయకులు వల్లే పర్వతాలు, బచ్చు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


