చిత్రం న్యూస్, తానూర్: నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని ఝరి (బి) గ్రామంలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయిందని, వెంటనే పునరుద్దరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ మాదిగ సాటే కాలనీలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గ్రామస్తులు పలుమార్లు మిషన్ భగీరథ అధికారులకు విన్నవించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని వాపోయారు. తానూర్ ఎంపీడీఓ, నిర్మల్ జిల్లా డీఎల్పీఓలు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
అదేవిధంగా మిషన్ భగీరథ పనుల సందర్భంగా సీసీ రోడ్, బ్రిడ్జ్ తవ్వి పైప్లైన్ వేసి అలాగే వదిలేయడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని, రాత్రి సమయంలో గుంతలు కనిపించక పలువురు అందులో పడిపోతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించడంతో పాటు తవ్విన రహదారులను మరమ్మతు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.


