చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఇస్కాన్ (ISKCON) దేవాలయ నిర్మాణానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే శ్రీ పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..భారతదేశంలో హిందువులుగా జన్మించడం మన పూర్వజన్మ సుకృతమని, ఇది ఎంతో అదృష్టకరమని అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యుద్ధాలు, అశాంతితో అల్లాడుతుంటే, భారతదేశం నేడు అత్యంత సురక్షితంగా, శాంతియుతంగా ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు.
ప్రభూవానంద ప్రభుజీ సేవలు అమోఘం:
ఆదిలాబాద్ ప్రాంతంలో ప్రభూవానంద ప్రభుజీ నాయకత్వంలో ఇస్కాన్ సంస్థ ఆధ్యాత్మికతను విశేషంగా ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే అభినందించారు. ప్రభుజీ తన ప్రసంగాల ద్వారా సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మందిని ప్రభావితం చేస్తూ, ప్రజలను భక్తి మార్గంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ఇస్కాన్ ఆలయ నిర్మాణం ద్వారా జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెంపొందుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బండారి దేవన్న, తాటిపల్లి రాజు, ఇస్కాన్ ప్రతినిధులు, భక్తులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


