Chitram news
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 9:43 pm Editor : Chitram news

ఆశా వర్కర్ పద్మకు న్యాయం చేయాలి: సీఐటీయూ 

చిత్రం న్యూస్, నిర్మల్: ఖానాపూర్ మండలం సోమరిపేట్ గ్రామానికి చెందిన ఆశా వర్కర్ పద్మకు న్యాయం చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ ) నిర్మల్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. గ్రామస్తులు వెలివేసిన ఒక గర్భిణికి సేవలు అందించినందుకు ఆమెను ఏఎన్‌ఎమ్ చంద్రకళ అసభ్య పదజాలంతో దూషించిందని, దీనితో పద్మ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని యూనియన్ ఆరోపించింది. ఆదివాసీ గ్రామానికి చెందిన ఓ మహిళను గ్రామస్తులు వెలివేయడం జరిగిన సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు పి.గంగమణి పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో అక్కడ పనిచేస్తున్న ఏఎన్‌ఎమ్ చంద్రకళ ఆ మహిళకు వైద్య సేవలు అందించవద్దని ఆశా వర్కర్ పద్మకు ఆదేశించడం అత్యంత అమానుషమని విమర్శించారు.గర్భిణికి 9 నెలలు నిండిన తర్వాత నొప్పులు రావడంతో ఆశా వర్కర్ పద్మ తన బాధ్యతగా స్పందించి అంబులెన్స్‌ను పిలిపించి ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేయించారు. ఇది ఆశా వర్కర్ పద్మ మానవత్వానికి, విధి నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు అనంతరం, ఏఎన్‌ఎమ్ చంద్రకళ ఫోన్‌లో ఆశా వర్కర్ పద్మను అసభ్య పదజాలంతో దూషించిందని ఆరోపించారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక పద్మ ఆత్మహత్యాయత్నం చేసుకోవడం చాలా బాధాకరమని యూనియన్ నాయకులు తెలిపారు. ఆశా వర్కర్ పద్మపై దుర్వినియోగానికి పాల్పడిన ఏఎన్‌ఎమ్ చంద్రకళపై తక్షణ చర్యలు తీసుకోవాలని, పద్మకు పూర్తి రక్షణ కల్పించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి. సుజాత డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు భయపడకుండా విధులు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.