చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఆయా గ్రామాలలో సోమవారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. దీంతో వేడి నుంచి ఉపశమనం లభించి వాతావరణం చల్లబడినప్పటికీ, అకాల వర్షం రైతులను నిలువునా ముంచింది. ముఖ్యంగా కోత దశలో ఉన్న జొన్న, మొక్కజొన్న, పంటలు దెబ్బతినే అవకాశం ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో అకాల వర్షం పడటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ముథోల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో సైతం అకాల వర్షానికి పంటలకు నష్టం వాటిల్లే అవకాశము ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


