Chitram news
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 8:20 am Editor : Chitram news

లక్షెట్టిపేట–దండేపల్లి ప్రాంతంలో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం వేడుకలు

చిత్రం న్యూస్, లక్షెట్టిపేట: క్రైస్తవుల పవిత్ర పండుగలలో ముఖ్యమైన మట్టల ఆదివారం (Palm Sunday) వేడుకలు లక్షెట్టిపేట–దండేపల్లి ప్రాంతాలలో ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రాంతంలోని వివిధ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు నిర్వహించగా విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మట్టల ఆదివారం సందర్భంగా యేసు క్రీస్తు యెరూషలేములో విజయప్రవేశం చేసిన దినాన్ని స్మరించుకుంటూ విశ్వాసులు చేతుల్లో ఈత కొమ్మలు (మట్టలు) పట్టుకుని ఊరేగింపులు నిర్వహించారు. చర్చిల వద్ద ప్రార్థనలు అనంతరం భక్తులు “హొసన్నా” అంటూ కీర్తనలు పాడుతూ ప్రార్థనలు చేశారు.

చర్చిలలో ప్రత్యేక బైబిల్ సందేశాలు అందించబడగా, పాస్టర్లు విశ్వాసులకు పవిత్ర వారానికి (Holy Week) సంబంధించిన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరించారు. మట్టల ఆదివారం నుండి ప్రారంభమయ్యే పవిత్ర వారం యేసు క్రీస్తు శిలువ వేయబడిన శుక్రవారం, పునరుత్థానం జరిగిన ఈస్టర్ పండుగకు దారితీస్తుందని తెలిపారు.

ఈ వేడుకల్లో యువత, మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. చర్చిలను తాటి ఆకులతో అలంకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. స్థానిక క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతి, ప్రేమ, సేవా భావాలను పాటించాలని పిలుపునిస్తూ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.