చిత్రం న్యూస్, రామగుండం: రామగుండం జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి అవసరమైన పరికరాల ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ విభాగాలను, క్రిటికల్ కేర్ సెంటర్, ఎస్.ఎన్.సి.యూ, ఎక్స్ రే ఏరియా, అల్ట్రా సౌండ్, చిన్న పిల్లల విభాగం, ఫిజియోథెరపీ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆసుపత్రికి అవసరమైన పరికరాల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రిలో అదనంగా ఒక ఎక్స్ రే మేషిన్, అల్ట్రా సౌండ్ ఏర్పాటు చేయాలని, ఫిజియోథెరపీ నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామక చేపట్టాలని అన్నారు.సదరం విభాగంలో చేసిన ఏర్పాట్ల పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి న్యూ బ్లాక్ లో అవుట్ పేషంట్ రూమ్ లను కలెక్టర్ పరిశీలించారు. వైద్యులు సకాలంలో విడుదలకు హాజరవుతూ రోగులకు మంచి సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.అనంతరం కలెక్టర్ ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధులతో గోదావరిఖని లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట వైద్య అధికారులు డాక్టర్ అరుణ ,డాక్టర్ కృపా భాయ్, డాక్టర్ రాజు, నర్సింగ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




