Chitram news
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 10:18 pm Editor : Chitram news

అగ్నివీర్ పథకంపై భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు

చిత్రం న్యూస్, భైంసా: 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కళాశాలలో విద్యార్థుల్లో దేశ సేవ పట్ల చైతన్యం పెంపొందించుటకు సాయుధ దళాలలో ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించుటకు అగ్నివీర్ పథకంపై భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీ బుచ్చయ్య మాట్లాడుతూ, విద్యార్థులు చిన్న వయస్సు నుంచే దేశ సేవ పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని, అగ్నివీర్ వంటి పథకాలు యువతకు మంచి అవకాశాలను అందిస్తున్నాయని పేర్కొన్నారు. క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.కార్యక్రమానికి హాజరైన IQAC కోఆర్డినేటర్ డా. రవి కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించవలసిన అవసరాన్ని వివరించారు. అగ్నివీర్ పథకం ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

డా.ఎం.శంకర్ అగ్నివీర్ పథకంపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. అర్హతలు, ఎంపిక విధానం, శారీరక, వైద్య ప్రమాణాలు, వ్రాత పరీక్ష సిలబస్ వంటి అంశాలను స్పష్టంగా వివరించి విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే ఈ పథకం ద్వారా లభించే శిక్షణ, ఆర్థిక ప్రయోజనాలు, భవిష్యత్ కెరీర్ అవకాశాలపై విద్యార్థులను ప్రేరేపించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.రఘునాథ్,  సీనియర్ అధ్యాపకులు డా. భీమా రావు , రాజు పాల్గొని విద్యార్థులకు మార్గదర్శక సూచనలు అందించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం అనంతరం నిర్వహించిన సందేహ నివృత్తి సమావేశంలో విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. మొత్తం కార్యక్రమం విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ మరియు బాధ్యతాభావాన్ని పెంపొందించుటలో ఫలప్రదంగా నిలిచింది.