చిత్రం న్యూస్, తెలంగాణ డెస్క్:భారత రైల్వే ప్రయాణికులకు కీలక మార్పులు తీసుకొచ్చింది. టికెట్ క్యాన్సిలేషన్, రిఫండ్ విధానంలో సవరించిన కొత్త నిబంధనలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు దశలవారీగా అమల్లోకి రానున్నాయి.,కొత్త విధానం ప్రకారం, ప్రయాణానికి 72 గంటల ముందే కన్ఫామ్ టికెట్ను రద్దు చేస్తే గరిష్ట రిఫండ్ లభిస్తుంది. అయితే నిర్ణీత క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు. 72 నుంచి 24 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే సుమారు 25 శాతం కోత విధించి మిగిలిన మొత్తం రిఫండ్ చేస్తారు. 24 నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే ఇది లేట్ క్యాన్సిలేషన్గా పరిగణించి 50 శాతం కోత విధిస్తారు. ట్రైన్ బయల్దేరే ముందు 8 గంటల లోపు లేదా బయల్దేరిన తర్వాత టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ ఉండదు. ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని అదనపు సదుపాయాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్ పాయింట్ను మార్చుకునే అవకాశం కల్పించారు. అలాగే కౌంటర్ టికెట్లను ఇకపై ఏ రైల్వే స్టేషన్లోనైనా క్యాన్సిల్ చేసుకునే వీలుంది.
ఇ-టికెట్ కలిగిన ప్రయాణికులకు TDR ప్రక్రియను కూడా సులభతరం చేశారు. ఇకపై మాన్యువల్గా TDR ఫైల్ చేయాల్సిన అవసరం లేకుండా, నిబంధనల ప్రకారం ఆటోమేటిక్గా రిఫండ్ ప్రాసెస్ అవుతుంది. అదనంగా, కౌంటర్ టికెట్ ఉన్నవారు ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు తమ ట్రావెల్ క్లాస్ను అప్గ్రేడ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న క్యాన్సిలేషన్ ఛార్జీల ప్రకారం ఏసీ ఫస్ట్ క్లాస్కు రూ.240 + GST, ఏసీ 2 టైర్కు రూ.200 + GST, ఏసీ 3 టైర్ లేదా ఛైర్ కార్కు రూ.180 + GST, స్లీపర్కు రూ.120, సెకండ్ క్లాస్కు రూ.60 వసూలు చేస్తున్నారు.మొత్తంగా ఈ కొత్త మార్పులు ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కలిగించడమే కాకుండా, రిఫండ్ ప్రక్రియను సులభతరం చేసే దిశగా రూపొందించబడ్డాయి. నిబంధనలు కాలానుగుణంగా మారే అవకాశం ఉంది. ప్రయాణానికి ముందు తాజా సమాచారం పరిశీలించాలని రైల్వే శాఖ పేర్కొంటుంది.




