చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముథోల్ నియోజక వర్గంలో డాక్టర్ కిరణ్ కొమ్రెవార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామ బాట కార్యక్రమంలో భాగంగా బాసర మండలంలోని బిద్రేల్లి,లాబ్ధి, దొడాపూర్,టాక్లీ గ్రామాల్లో పార్టీ నేతలు పర్యటించి గ్రామ పెద్దలను,రైతులను కలిసి వారి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాటి అమలు గురించి గ్రామ ప్రజలకు వివరించారు. ప్రభుత్వం రైతుల పంటలను సకాలంలో కొనుగోలు చేయక పోవటం వలన ప్రైవేట్ దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని, రైతులు నష్ట పోతున్నారన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రతి పంట కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తోందని విమర్శించారు.ఇది కేవలం దళారుల లబ్ధి కోసమేనని ఆరోపించారు. ఇప్పటికే నియోజకవర్గంలో శనగలు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్న తరువాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఏర్పాటుచేయాలని, తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మేలు చేయాలని కోరారు. మొక్కజొన్నకు ప్రతి క్వింటా కు ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి ప్రతి గింజ కొనేలా చూడాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు అన్యాయం చేసిందని ప్రజా పాలన లో పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ గ్రామ ప్రజల తరఫున, రైతు పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు.



