Chitram news
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 4:36 pm Editor : Chitram news

నిరంతరాయంగా ‘కంది’ నిత్యాన్నదానం: పేదల ఆకలి తీరుస్తున్న ప్రజాసేవా భవన్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ డెస్క్: ఆకలితో అలమటించే నిరుపేదల కడుపు నింపడమే పరమావధిగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమం జిల్లాలో ఒక మహోద్యమంలా సాగుతోంది. పేద రైతు కుటుంబంలో పుట్టి, అమెరికాలో స్థిరపడి, మాతృభూమిపై ప్రేమతో తిరిగి వచ్చిన ఆయన.. తన సేవా గుణంతో వేలాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మూడేళ్లుగా నిర్విరామంగా..

ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ‘ప్రజాసేవా భవన్’ గత మూడేళ్లుగా అన్నపూర్ణ నిలయంగా మారింది. జిల్లా నలుమూలల నుండి వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే పేదలు, కార్మికులు, విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో శ్రీనివాస రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతిరోజూ వందలాది మంది ఇక్కడ కడుపు నిండా భోజనం చేస్తున్నారు.

కె.ఎస్.ఆర్ (KSR) ఫౌండేషన్ ద్వారా సేవలు:

అమెరికా నుండి వచ్చిన తర్వాత తన తండ్రి పేరిట కె.ఎస్.ఆర్ ఫౌండేషన్ స్థాపించిన శ్రీనివాస రెడ్డి, దాని ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. “అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్న” అనే ఉద్దేశంతో ఆయన చేపట్టిన ఈ నిత్యాన్నదాన కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కంది శ్రీనివాస రెడ్డి కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా, ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే *’నిత్యాన్నదాత’* గా జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మండుటెండల్లో సైతం విరామం లేకుండా ఇంత పెద్ద ఎత్తున భోజన వసతి కల్పించడం అభినందనీయమని, శ్రీనివాస రెడ్డి సేవా దృక్పథం అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రజలు కొనియాడుతున్నారు.