చిత్రం న్యూస్, ఖమ్మం:ఖమ్మం జిల్లాలో ఓ వృద్ధుడు ఆత్మహత్య ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆర్థిక కష్టాలు ఒక మనిషిని ఎంతటి దారుణ నిర్ణయానికైనా పురికొల్పుతాయని ఈ ఘటన నిరూపిస్తోంది. ఎర్రుపాలెం మండలంలో జరిగిన ఈ విషాద ఘటన చూసి స్థానికులు ఒళ్లు గగుర్పొడిచేలా భయాందోళనకు లోనయ్యారు. బనిగండ్లపాడు గ్రామానికి చెందిన యన్నం వెంకట్రామిరెడ్డి (70) గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అప్పుల భారం పెరగడంతో మనస్తాపానికి గురైన ఆయన, తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సమీపంలోని ఒక బ్రిడ్జి వద్దకు వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఉరివేసుకున్న సమయంలో తాడు బిగుసుకుపోయి, మృతదేహం బరువుకు తల మొండెం నుండి వేరైపోయింది.తల బ్రిడ్జికి వేలాడుతూ ఉండగా, మొండెం కింద పడిపోవడంతో అక్కడ అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ఉదయాన్నే అటుగా వెళ్లిన స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.ఎర్రుపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహ భాగాలను సేకరించి పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రాథమిక విచారణలో అప్పుల బాధే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణమని తేలింది.మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. వృద్ధాప్యంలో తోడుండాల్సిన సమయంలో ఆర్థిక కష్టాల వల్ల ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


