చిత్రం న్యూస్, ముథోల్ : ముథోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ భైంసా డివిజన్ పరిధిలో శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ మద్దతు ధరను వినియోగించుకోవాలని సూచించారు. భైంసా డివిజన్ పరిధిలో మార్క్ఫెడ్, నాఫెడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు, కుభీర్ మార్కెట్ యార్డు, తానూర్, ముథోల్ (విట్టోలి) లో శనగ కొనుగోలు కేంద్రాలను శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, శనగ రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్దతు ధర (MSP) కొనుగోలు కేంద్రాలలో తమ పంటను విక్రయించాలని సూచించారు.ప్రభుత్వం శనగకు క్వింటాలుకు రూ.5,875 మద్దతు ధరను నిర్ణయించిందని, రైతులు తమ పంటలో తేమ శాతం 14 శాతానికి మించకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రైవేటు మార్కెట్ ధరల కంటే ఎక్కువగా ఉన్నందున, రైతులు ప్రభుత్వ కేంద్రాలలో అమ్మడం ద్వారా లాభపడతారని ఆయన పేర్కొన్నారు.త్వరలోనే మక్క, జొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కానున్నాయని ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.


