చిత్రం న్యూస్, జైనథ్: కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, కనీసం పట్టా ఉన్న రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించడంలో విఫలమైందని బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా జైనథ్ మండల అధ్యక్షులు ఏనుగు రాకేష్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లి (బి) గ్రామానికి చెందిన రైతు తుడుం గణపతి ఆత్మహత్యను ఆయన “ప్రభుత్వ హత్య”గా అభివర్ణించారు. అప్పుల బాధ తాళలేక తనువు చాలించిన గణపతి కుటుంబాన్ని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని డిమాండ్ చేశారు.మృతి చెందిన తుడుం గణపతి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్నారు. రైతు బీమా వయోపరిమితిని 59 ఏళ్ల నుండి 75 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.అప్పుల ఊబిలో ఉన్న రైతుల పట్ల బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించేలా ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సిడం రాకేష్, సాయి ,ప్రవీణ్, నర్సింగ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.


