చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీజేఎల్పీ ఉప నేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ పూర్తిగా బీసీ వర్గాలను మోసం చేసే విధంగా ఉందని, అణగారిన వర్గాల ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరించిందని ఆయన మండిపడ్డారు.
బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం:
గత తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ బీసీలకు ఒరిగిందేమీ లేదని ఆయన విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో బీసీలకు కనీసం రూ.1 లక్ష వరకు సబ్సిడీ రుణాలు అందేవని, కానీ నేడు తెలంగాణలో బీసీ కార్పొరేషన్ ఉనికి లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. బీసీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
అంకెల గారడీ.. అమలు శూన్యం:
బడ్జెట్లో కేటాయింపులకు, వాస్తవ ఖర్చులకు పొంతన లేదని పాయల్ శంకర్ విమర్శించారు. ఇళ్ల నిర్మాణానికి రూ.23,000 కోట్లు కేటాయించినట్లు చెబుతున్నా, వాస్తవానికి కేవలం రూ.3,000 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బడ్జెట్ నిధుల్లో కేవలం 25 శాతం మాత్రమే ఖర్చు చేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు.
రైతులు, ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం:
వ్యవసాయ రంగానికి సంబంధించి ‘ఫసల్ భీమా యోజన’ అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను సకాలంలో అందించలేని ప్రభుత్వం, ఇతర అంశాలపై కోట్లు ప్రకటించడం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు.
పోరాటం తప్పదు:
విద్యారంగానికి తగిన నిధులు కేటాయించకపోవడం భవిష్యత్ తరాలను దెబ్బతీయడమేనని హెచ్చరించారు. ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్పై భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ లోపల, బయట గట్టిగా పోరాడుతుందని.. బీసీలు, రైతులు, ఉద్యోగుల హక్కుల కోసం వెనకడుగు వేయబోమని పాయల్ శంకర్ స్పష్టం చేశారు.


