చిత్రం న్యూస్, నిర్మల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ లో మంగళవారం మండల బీజేపీ అధ్యక్షుడు కాల్వ నరేష్, నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల పాలనలో ఇప్పటివరకు ఆరు గ్యారంటీలను, 420 హామీలను నెరవేర్చలేదని వారు ఆరోపించారు.
ప్రస్తుత బడ్జెట్ లో ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించి, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా కొత్త పెన్షన్లు, రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహాయం వంటి పథకాలకు వెంటనే నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, తక్షణమే ఆరు గ్యారంటీలను అమలు చేయాలని వారు స్పష్టం చేశారు. లేనిపక్షంలో ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

