చిత్రం న్యూస్, బైంసా: అప్పటివరకు కుటుంబసభ్యులతో ఆ చిట్టి తల్లి చిరునవ్వులు చిందించింది. అంతలోనే విధి వక్రీకరించిందేమో తండ్రి కారు టైరు కింద పడి 16నెలల పసికందు మృతిచెందిన ఈ విషాదకర ఘటన నిర్మల్ జిల్లా తానూరు మండలంలో చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోరేగాం గ్రామానికి చెందిన బాలేరావ్ అవదుత్ – సుష్మ గత కొంతకాలంగా వలస నిమిత్తం నార్కట్ పల్లి వెళ్లారు. కాగా బంధువుల పెళ్లి కోసం తన ఇద్దరు కుమారైలతో స్వగ్రామం బోరేగాం వచ్చారు. సోమవారం ఇంటి దగ్గర ఉన్న కారును చెట్టు కింద నీడలో పెట్టేందుకు రివర్స్ తీసే క్రమంలో గమనించని తండ్రి తప్పిదం వల్ల తన 16 నెలల కూతురు శ్రీయంశి టైర్ కింద పడి తీవ్రంగా గాయపడింది. గమనించిన తండ్రి వెంటనే భైంసా ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఈ విషాదకర ఘటన కుటుంబీకులు బంధువులను చిదిమి వేసింది. చిన్నారి మృతిపట్ల తల్లిదండ్రులు, కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జుబేర్ తెలిపారు.