చిత్రం న్యూస్, అదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి కార్యక్రమాన్ని ఉద్యోగులందరూ సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా టీఎన్జీవోస్ సంఘం రూపొందించిన 2026 వ సంవత్సరపు డైరీని ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్, పీవో ను టీఎన్జీవోస్ జిల్లా కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యోగులందరికీ ఉపయోగకరంగా ఉండేలా డైరీలో ప్రభుత్వ ఉత్తర్వులను పొందుపరచడంతో పాటు, వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పొందుపరచడం పట్ల టీఎన్జీవో నాయకులను కలెక్టర్ అభినందించారు. ప్రజా పాలన – ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా శాఖల అధికారులు తమ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని, పెండింగ్ ఫైళ్లను సత్వరమే పరిష్కరించాలని, రికార్డులను సక్రమంగా నమోదు చేయాలని, మరమ్మత్తుల నిర్వహణ చేపట్టాలని, పనికిరాని వస్తువులను తొలగించాలని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను ప్రగతి పథంలో అగ్రగామిగా నిలపడంలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నవీన్ కుమార్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ. తిరుమల్ రెడ్డి, జిల్లా బాధ్యులు జి.గోపి, రాజేశ్వర్, నారాయణ, రవి , ఓం ప్రసాద్, రూరల్ యూనిట్ అధ్యక్షులు ప్రవీణ్, అర్బన్ కార్యదర్శి అరుణ్, వార్డెన్ సంఘం అధ్యక్షుడు నర్సింలు, గోవిందు, శ్రీనివాస్, నవీన్, సంజీవ్, సాయి కుమార్, విజయ్ , సంజయ్, టీఎన్జీవో యూనియన్ మాజీ అధ్యక్షులు సంద అశోక్, మహిళా బాధ్యులు, వందన, సుజాత, రాధ, సంగీత, ఆశ జ్యోతి వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

